రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి: ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు.
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న, రాజీ కుదుర్చుకునే అవకాశం ఉన్న కేసుల్లో ఇరుపక్షాలు పరస్పర అవగాహనతో ముందుకు వచ్చి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండి జీవితాలను ఇబ్బందులకు గురిచేయకుండా చూసుకోవాలని సూచించారు.
లోక్ అదాలత్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ మరియు వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు తదితర అంశాల్లో ఇరువర్గాల సమ్మతితో రాజీ కుదుర్చుకునే అవకాశం ఉంటుందని ఎస్పీ వివరించారు.
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి అధికారులు నుంచి కానిస్టేబుళ్ల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన, సులభమైన, ఖర్చులేని మరియు సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.
