Breaking News

కదులుతున్న రైలులో ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ.. సాంకేతిక ఆధారాలతో చాకచక్యంగా గుర్తించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు

హైదరాబాద్, జూలై 28: ఇళ్ల నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన ముగ్గురు మైనర్ బాలికలను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజీలు, సోషల్ మీడియా విశ్లేషణ సహాయంతో గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

కేసు వివరాలు

జూలై 25న ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి కనిపించడం లేదని వారిలో ఒకరి తల్లి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో భాగంగా ఇంట్లో చిన్నచిన్న విషయాలకు తల్లిదండ్రులు తరచూ మందలించడంతో మనస్తాపానికి గురైన బాలికలు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకుని ఇళ్ల నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీల పరిశీలనలో కాటేదాన్ ప్రాంతం నుంచి ఆటోలో బయలుదేరినట్లు నిర్ధారించారు.

ఐదు ప్రత్యేక బృందాలతో గాలింపు

రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలికల కోసం గాలింపు చేపట్టారు. రైల్వే పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కాటేదాన్, బుద్వేల్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి వారి ప్రయాణ మార్గాన్ని గుర్తించారు.

ఇన్‌స్టాగ్రామ్ ఆధారంగా లొకేషన్ ట్రాక్

దర్యాప్తులో బాలికల్లో ఒకరు తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్ ఆధారంగా సాంకేతిక విశ్లేషణ చేపట్టి వారి లొకేషన్‌ను ట్రాక్ చేశారు.

“ఎరైవ్ అలైవ్” ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ జంక్షన్ వద్ద 200 ఐఎస్‌ఐ హెల్మెట్లు పంపిణీ చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

బీనా రైల్వే స్టేషన్‌లో రెస్క్యూ

సాంకేతిక ఆధారాల ద్వారా బాలికలు ‘దక్షిణ్ ఎక్స్‌ప్రెస్’ రైలులో ప్రయాణిస్తున్నట్లు, వారు ఉన్న బోగీ, సీటు నంబర్లను కూడా పోలీసులు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులకు అందించడంతో మధ్యప్రదేశ్‌లోని బీనా రైల్వే స్టేషన్‌లో రైలును తనిఖీ చేసి ముగ్గురు బాలికలను సురక్షితంగా గుర్తించి రెస్క్యూ చేశారు.

అనంతరం బాలికలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయడంతో పాటు నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

తల్లిదండ్రులకు పోలీసుల సూచనలు

ఈ సందర్భంగా పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలని, వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని పోలీసులు సూచించారు. చిన్న విషయాలకు తీవ్రంగా మందలించడం కంటే ఓర్పుతో సమస్యలను పరిష్కరించాలని, పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై తగిన పర్యవేక్షణ ఉంచాలని తెలిపారు. అలాగే ఏ సమస్య వచ్చినా ఇంటి నుంచి వెళ్లిపోవడం పరిష్కారం కాదని, కుటుంబ సభ్యులు లేదా విశ్వసనీయ వ్యక్తుల సహాయం తీసుకునేలా పిల్లలకు ధైర్యం చెప్పాలని తల్లిదండ్రులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *