Breaking News

సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్, సీసీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి: సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్, స్టేషన్ రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల స్థితిగతులను ఆయన పరిశీలించారు.

అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించిన ఎస్పీ, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు నమోదు నుంచి చార్జ్‌షీట్ దాఖలు వరకు ప్రతి దశను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచాలని స్పష్టం చేశారు.

మహిళలపై జరుగుతున్న నేరాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. ప్రజలు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా నేరాల నివారణకు దోహదపడుతుందని తెలిపారు.

అనంతరం సిబ్బంది కిట్ బ్యాగ్‌లను తనిఖీ చేసిన ఎస్పీ, విధి నిర్వహణలో ఉపయోగపడే ప్రతి వస్తువును జాగ్రత్తగా సంరక్షించి వినియోగించాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి నీట్ టర్న్‌అవుట్‌ను పాటిస్తూ, రోజువారీ వ్యాయామంతో శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

సంగారెడ్డి ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం

ప్రజలకు పారదర్శకంగా, సులభంగా పోలీసు సేవలు అందించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తితో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారానికి భరోసా కల్పించాలని ఎస్పీ ఆదేశించారు.

ఈ తనిఖీలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో మహేష్ గౌడ్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు శివకుమార్, ప్రసాద్ రావు, ఎస్‌ఐ మాణిక్ రెడ్డి, మహిళా ఎస్‌ఐ పూల్ భాయ్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *