సంగారెడ్డి, జూలై 28: సంగారెడ్డి జిల్లాలో రౌడీ, కేడీ, సస్పెక్ట్ షీటర్లకు పోలీసులు ప్రత్యేకంగా “రౌడీ మేళా” కార్యక్రమాన్ని నిర్వహించి కౌన్సెలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తనతో జీవిస్తే నిబంధనల ప్రకారం హిస్టరీ షీట్లను మూసివేస్తామని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ తెలిపారు.
అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని సబ్-డివిజన్లలో రౌడీ మేళా కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు, నారాయణఖేడ్ సబ్-డివిజన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు సంబంధిత డీఎస్పీల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి, చట్టాన్ని గౌరవిస్తూ సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని రౌడీ, కేడీ, సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. సత్ప్రవర్తన కనబరిచిన వారి హిస్టరీ షీట్లను నిబంధనల ప్రకారం క్లోజ్ చేస్తామని, అయితే తిరిగి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలవాటుపడిన నేరస్థులపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు హిస్టరీ షీట్లు కూడా తెరవడం జరుగుతుందని పేర్కొన్నారు.
పోలీసులతో స్నేహపూర్వకంగా ఉంటూ జిల్లాలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని కోరారు. ఎక్కడైనా గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు లేదా ఇతర నేర కార్యకలాపాలపై సమాచారం ఉంటే ఎస్-న్యాబ్ హెల్ప్లైన్ 8712656777కు వెంటనే తెలియజేసి పోలీసులకు సహకరించాలని అదనపు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
