మహబూబ్నగర్, ఆగస్టు 1: మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం, రాజాపూర్లో జాతీయ రహదారి-44పై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను జిల్లా ఎస్పీ డి. జానకి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు.
ఫ్లైఓవర్కు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్లపై కాలినడకన పరిశీలించిన ఎస్పీ, ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై ఏర్పడిన గుంతలు, బురదతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గమనించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెంటనే సర్వీస్ రోడ్లకు మరమ్మతులు చేపట్టి, గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చాలని కాంట్రాక్టర్ ప్రతినిధులకు ఆదేశించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సర్వీస్ రోడ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలు, రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో జడ్చర్ల రూరల్ సీఐ మహేష్, బాలానగర్ ఎస్సై నరేందర్ రెడ్డి తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
