Breaking News

వేధింపులను మౌనంగా భరించకండి.. వెంటనే ఫిర్యాదు చేయండి: ఎస్పీ మహేష్ బి. గితే

5 నెలల్లో 14 ఎఫ్‌ఐఆర్‌లు, 16 పెట్టి కేసులు నమోదు చేసిన షీ టీమ్

జిల్లా ప్రతినిధి: మహిళలు, బాలికలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులు ఎదురైనా మౌనంగా భరించకుండా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, బాధితులకు రక్షణ కవచంలా షీ టీమ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. గడిచిన ఐదు నెలల కాలంలో షీ టీమ్‌కు అందిన ఫిర్యాదుల ఆధారంగా 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, మరో 16 పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళలు, విద్యార్థినులను వేధిస్తున్న వ్యక్తులను గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు.

మహిళలు, బాలికలు, విద్యార్థినులు వేధింపులకు గురైనప్పుడు వెంటనే సమాచారం అందిస్తే జిల్లా షీ టీమ్ తక్షణమే స్పందించి అవసరమైన రక్షణ చర్యలు చేపడుతుందని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు.

చెర్లగౌరారంలో ఘనంగా ‘బాల పంచాయతీ’ కార్యక్రమం

జిల్లాలోని విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రాంతాలు, రద్దీ ప్రదేశాల్లో షీ టీమ్ బృందాలు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, సైబర్ మోసాలు, మహిళల హక్కులు మరియు భద్రత అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా జిల్లాలో గుర్తించిన హాట్‌స్పాట్ల వద్ద షీ టీమ్ సిబ్బంది మఫ్టీలో నిత్యం నిఘా ఉంచి మహిళలు, విద్యార్థినులను వేధించే ఆకతాయిలపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విద్యాసంస్థలు, రహదారులు లేదా ఉద్యోగ ప్రదేశాల్లో ఎవరైనా అవమానకరంగా ప్రవర్తించినా, వెంబడించినా వెంటనే జిల్లా షీ టీమ్ నంబర్ 8712656425కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *