Breaking News

వార్షిక తనిఖీల్లో భాగంగా ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూన్ 16: వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ, డీఎస్పీతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.

అనంతరం స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, రికార్డుల నిర్వహణ, కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు. సిబ్బంది కిట్ సామగ్రి సర్వీస్ కాలమంతా ఉపయోగపడేలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న లేదా కేసులకు సంబంధించిన వాహనాల వివరాలను పరిశీలించి, కేసు ప్రాపర్టీని సకాలంలో కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించారు.

స్టేషన్ రికార్డులను తనిఖీ చేసిన ఎస్పీ, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలని, మిస్సింగ్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆస్తి సంబంధిత నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి, పగలు-రాత్రి బీట్ విధుల్లో నిఘా పెంచాలని అధికారులకు సూచించారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎస్‌హెచ్‌ఓకు సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యల పరిష్కారంపై భరోసా కల్పించాలని పేర్కొన్నారు.

విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని ఎస్పీ సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు, పాపిలాన్ డివైస్ ద్వారా అనుమానితుల వేలిముద్రలు సేకరించి పాత నేరస్తులను గుర్తించాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ కోసం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ప్రతిరోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వాహనాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.

సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్, సీసీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

తెలంగాణ పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన సీసీటీఎన్ఎస్-2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి సాంకేతిక వ్యవస్థలపై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకుని నేరాల నియంత్రణలో సమర్థవంతంగా వినియోగించాలని సిబ్బందికి సూచించారు.

స్టేషన్ రికార్డులను పార్ట్-1 నుంచి పార్ట్-5 వరకు ఎలాంటి పెండింగ్ లేకుండా సీసీటీఎన్ఎస్-2.0లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, సిబ్బందికి వర్టికల్ వారీగా విధులు కేటాయించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు సూచించారు.

అనంతరం సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. విధి పరమైన లేదా వ్యక్తిగత సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ ఇంద్రకరణ్ స్టేషన్ అధికారి, సిబ్బంది పనితీరును జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *