నల్గొండ, జూలై 28: నల్గొండ జిల్లా కట్టంగూర్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు.
పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, బెయిల్పై ఉన్న నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తరచూ నాకాబందీలు, వాహన తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించిన ఎస్పీ, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటుబెల్ట్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే బ్లాక్స్పాట్ల వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని సూచించారు.
సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, ఆన్లైన్ మోసాలపై వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సున్నితంగా స్వీకరించి చట్టపరమైన చర్యలను వేగవంతంగా చేపట్టాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే విధానంపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ, అనంతరం స్టేషన్ సిబ్బందితో సమావేశమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడం ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
