సంగారెడ్డి పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందించేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంగారెడ్డి చౌరస్తా నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు, బైపాస్ రోడ్డు, సాయిబాబా కమాన్, కల్వకుంట రోడ్డు, ఇతర ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి, సమస్యలకు గల కారణాలను పరిశీలించినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత శాఖలతో కలిసి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని వెనక్కి తరలించడం లేదా ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించడం, ఆటోరిక్షాల కోసం ప్రత్యేక ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయడం, అవసరమైన చోట బొల్లార్డ్స్ ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
పాదచారులు ఫుట్పాత్లపై సురక్షితంగా నడిచేలా ఆక్రమణలను తొలగించాలని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి సంగారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని ఎస్పీ సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, వైస్ చైర్మన్ షైక్ షఫీ, ఆర్డీఓ రాఘవేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఆర్ఓ జయరాం, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, టౌన్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఎస్బీ ఇన్స్పెక్టర్, ఇతర పోలీసు అధికారులు, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
