Breaking News

నీట్-యూజీ 2026 పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

సంగారెడ్డి: ఆదివారం నిర్వహించనున్న నీట్-యూజీ 2026 పరీక్షను జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ Praveen Jain (ప్రతీక్ జైన్) మరియు జిల్లా ఎస్పీ Paritosh Pankaj సూచించారు. ఈ మేరకు జిల్లా అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలో మొత్తం 9 పరీక్షా కేంద్రాల్లో 2,924 మంది విద్యార్థులు నీట్-యూజీ 2026 పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంగారెడ్డి, జేఎన్‌టీయూ కేంద్రాలు, కేంద్రీయ విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, రవాణా తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పరీక్షను సీసీటీవీ నిఘాలో నిర్వహించనున్నట్లు పేర్కొన్న కలెక్టర్, కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ సిగ్నల్స్‌ను నిరోధించేందుకు జామర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని సూచించారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీజీఎస్‌పీడీసీఎల్ అదనపు సహాయ ఇంజనీర్

అనంతరం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, నీట్-యూజీ పరీక్ష సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్ల సేవలను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.

పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్-163 బీఎన్‌ఎస్‌ఎస్ (పూర్వపు సెక్షన్-144 సీఆర్‌పీసీ) అమలులో ఉంటుందని, గుంపులుగా తిరగడం లేదా అనవసరంగా గుమికూడడం నిషేధమని స్పష్టం చేశారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిర్ణీత సమయం తర్వాత గేట్లు మూసివేయబడతాయని హెచ్చరించారు.

ఎన్‌టీఏ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, అనుమతించిన వస్తువులు మాత్రమే వెంట తీసుకురావాలని సూచించిన అధికారులు, నీట్-యూజీ 2026 పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *