మహబూబాబాద్, ఆగస్టు 1: మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జూలై 1 నుంచి జూలై 31 వరకు నిర్వహించిన “ఆపరేషన్ ముస్కాన్–XII” విజయవంతంగా ముగిసింది. నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, అనాథ, నిరాశ్రయులు మరియు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించేందుకు ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి.
ఈ ఆపరేషన్లో మొత్తం 40 మంది చిన్నారులను గుర్తించి రక్షించారు. వీరిలో 24 మంది బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై 20 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మిగిలిన 16 మంది చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీస్ స్టేషన్ పరిధి వారీగా మహబూబాబాద్ సబ్ డివిజన్లో 23 మంది చిన్నారులను రక్షించగా, 10 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి, 12 కేసులు నమోదు చేశారు. తొర్రూర్ సబ్ డివిజన్లో 17 మంది చిన్నారులను రక్షించి, 6 మందికి కౌన్సెలింగ్ నిర్వహించగా, 8 కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి విద్య, భద్రత, ఆరోగ్యకరమైన బాల్యం రాజ్యాంగం కల్పించిన హక్కులని పేర్కొన్నారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతం కావడానికి కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (CWC, DCPU), చైల్డ్ హెల్ప్లైన్–1098, కార్మిక శాఖ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
బాలకార్మికులు, అనాథలు లేదా ప్రమాదంలో ఉన్న చిన్నారులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే డయల్–100, 112 లేదా చైల్డ్ హెల్ప్లైన్–1098కు సమాచారం అందించి వారి భవిష్యత్తును కాపాడడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
