Breaking News

ఆపరేషన్ ముస్కాన్–XII: సంగారెడ్డి జిల్లాలో 173 మంది బాల కార్మికులకు విముక్తి.. 136 కేసులు నమోదు

సంగారెడ్డి, ఆగస్టు 1: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆపరేషన్ ముస్కాన్–XIIలో సంగారెడ్డి జిల్లా పోలీసులు విశేష ఫలితాలు సాధించారు. జూలై 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 173 మంది బాల కార్మికులను రక్షించినట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు.

రక్షించిన చిన్నారుల్లో 168 మంది బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారని వెల్లడించారు. బాలలను చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకున్న 136 మంది యజమానులపై కేసులు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC), జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU), విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో రక్షించిన చిన్నారులకు పునరావాసం కల్పించి, వారి విద్యాభ్యాసం కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, బాలల హక్కులను పరిరక్షించడం, వారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించడం, బలవంతంగా భిక్షాటన చేయించడం, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, పరిశ్రమలు, పౌల్ట్రీ ఫారాలు, కిరాణా దుకాణాలు తదితర ప్రాంతాల్లో పనిచేయించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. జిల్లాలో 104 మంది బాలబాలికలకు రక్షణ

ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపించినా లేదా బాలలపై వేధింపులు, దోపిడీ జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్–1098 లేదా డయల్–100కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతానికి కృషి చేసిన పోలీసు శాఖ, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *