హైదరాబాద్, ఆగస్టు 1: సికింద్రాబాద్లో ఆగస్టు 2 నుంచి 4 వరకు నిర్వహించనున్న ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లపై హైదరాబాద్ ట్రాఫిక్-I డిసిపి అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బందికి సమగ్ర అవగాహన (బ్రీఫింగ్) కార్యక్రమం నిర్వహించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి ట్రాఫిక్-I ఎ. రాములు, ఏసిపి ట్రాఫిక్ సికింద్రాబాద్ జోన్ ఎ. శ్రీనివాస్, ఏసిపి ట్రాఫిక్ ఖైరతాబాద్ జోన్ ఎస్. మోహన్ కుమార్, ఏసిపి ట్రాఫిక్ అడ్మిన్ జి. లక్ష్మణ్, ట్రాఫిక్ పీఎస్ మహంకాళి ఎస్హెచ్ఓ సిహెచ్. శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ నిర్వహణ, భక్తుల సౌకర్యం, భద్రత వంటి అంశాలపై డిసిపి సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. జాతర జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా రూపొందించిన ట్రాఫిక్ మళ్లింపు (డైవర్షన్) ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలని, పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను క్రమబద్ధంగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులు, వాహనదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని తెలిపారు.
బ్రీఫింగ్ అనంతరం డిసిపి అవినాష్ కుమార్ స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో కలిసి జాతర పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి అవసరమైన సూచనలు అందించారు.
ప్రజల సౌకర్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి అధికారి అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని డిసిపి పిలుపునిచ్చారు.
