మహబూబ్నగర్, జూన్ 16: ప్రజలకు త్వరితగతిన, సులభంగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందించాలనే లక్ష్యంతో జూన్ 20న నిర్వహించనున్న రెండవ జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి పిలుపునిచ్చారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న అనేక కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. త్వరితగతిన, తక్కువ వ్యయంతో శాశ్వత పరిష్కారం పొందేందుకు ఇది ఒక ఉత్తమ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్ చలానాలు, చిన్నపాటి క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, రాజీకి అనుకూలమైన ఇతర కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. సాధారణ కోర్టు విచారణలతో పోలిస్తే తక్కువ సమయంలోనే వివాదాలను ముగించుకునే వీలుంటుందని, దీనివల్ల సమయం, ధనం రెండూ ఆదా అవుతాయని చెప్పారు.
ఇరు పక్షాల అంగీకారంతో శాంతియుతంగా వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల సామాజిక సామరస్యానికి కూడా దోహదం చేస్తుందని ఎస్పీ వివరించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని సూచించారు.
“రాజీ మార్గమే రాజమార్గం” అనే భావనతో జూన్ 20న నిర్వహించే రెండవ జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ డి. జానకి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
