నల్గొండ: నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసి రద్దీగా ఉండే దుకాణాలు, సంతలు, వృద్ధులు నిర్వహించే షాపులను లక్ష్యంగా చేసుకుని చలామణి చేస్తున్న ఇద్దరు నిందితులను చండూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ రూ.500 నోట్లు, ప్రింటర్, స్కానర్, బాండ్ పేపర్లు, పల్సర్ బైక్ సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూర్ మండలం తాస్కానిగూడెం గ్రామానికి చెందిన ఆవుల కిరణ్ నిర్వహిస్తున్న శ్రీ మాధురి మిల్క్ సెంటర్లో జూన్ 12న ఓ వ్యక్తి పాల ప్యాకెట్ కొనుగోలు చేసి రూ.500 నోటు ఇవ్వగా, అది నకిలీ నోటుగా గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో చండూర్ సీఐ టి. రాము ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా జూన్ 15న నల్గొండలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న కంచర్ల టవర్స్లో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
అరెస్టయిన నిందితులు బెజవాడ రాజీవ్ అలియాస్ రాజు (38), అతని భార్య దుర్గం పావని (26)గా పోలీసులు గుర్తించారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్లు తయారు చేయడం నేర్చుకున్నామని, అవసరమైన ప్రింటర్, పేపర్ను ఆన్లైన్లో కొనుగోలు చేసి నకిలీ కరెన్సీ ముద్రించి చలామణి చేస్తున్నామని వారు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
- నకిలీ రూ.500 నోట్లు – 15
- నెంబర్ లేని పల్సర్ బైక్
- HP ప్రింటర్ & స్కానర్
- 100 JK ఎక్సెల్ సూపర్ వైట్ బాండ్ పేపర్లు
- 20 కట్ చేసిన పేపర్ ముక్కలు
- కత్తెర, స్పార్కెల్ పెన్, రెండు స్టీల్ స్కేల్స్
పోలీసుల వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు బెజవాడ రాజీవ్పై గతంలో హత్య, హత్యాయత్నం కేసులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ చలామణికి సంబంధించిన మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. మిర్యాలగూడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీషీట్ కూడా ఉన్నట్లు వెల్లడించారు.
ఈ కేసును వేగంగా ఛేదించిన చండూర్ ఎస్ఐ జె. శివకుమార్తో పాటు ఏఎస్ఐ శ్రీరాములు, పోలీసు సిబ్బంది ఆనంద్ రెడ్డి, శివరాం కృష్ణ, నరేందర్, ఉపేందర్లను నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
