మిర్యాలగూడ, జూన్ 16: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ మిర్యాలగూడ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ప్రత్యేకంగా “ఆపరేషన్ చెబుత్ర” నిర్వహించింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీల్లో ధాబాలు, లాడ్జీలు, హోటళ్లు, టీ స్టాళ్లు, రద్దీ కూడళ్లు, యువకులు గుమికూడే ప్రదేశాలు, అనుమానాస్పద ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు.
స్టేట్ హైవే SH-02 వెంట ఉన్న వాణిజ్య కేంద్రాలు, రాత్రివేళల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీలు చేపట్టడంతో పాటు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల వివరాలను పరిశీలించారు.
ఈ ఆపరేషన్లో భాగంగా సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న 78 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి వివరాలు నమోదు చేసి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, భవిష్యత్తులో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిబంధనలను ఉల్లంఘించిన ఆరు ధాబా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
ఈ ప్రత్యేక తనిఖీల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, నలుగురు సబ్ఇన్స్పెక్టర్లు, 20 మంది లా అండ్ ఆర్డర్ సిబ్బంది, 10 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, జిల్లాలో రౌడీయిజం, గంజాయి మరియు మద్యం అక్రమ రవాణా, పేకాట, ఈవ్ టీజింగ్, రాత్రివేళల్లో అనుమానాస్పద సంచారం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ధాబాలు, లాడ్జీలు, హోటళ్లను అడ్డాగా చేసుకుని నేరాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై దృష్టి ఉంచాలని, అర్ధరాత్రి వరకు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యువత చెడు అలవాట్లు, అనుమానాస్పద స్నేహాలు, మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరిన ఎస్పీ, జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు, కూంబింగ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
