సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు.
సంబంధిత అంశాలపై స్థానిక ఎస్హెచ్వోలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు సేకరించిన ఎస్పీ, ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మకుండా తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజావాణి కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
