Breaking News

మిర్యాలగూడలో విస్తృత నాకాబందీ: 150 వాహనాలపై కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 40 మంది పట్టివేత

మిర్యాలగూడ, జూలై 1: మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 150 వాహనాలపై కేసులు నమోదు చేయగా, మద్యం సేవించి వాహనాలు నడిపిన 40 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.

పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో నిర్వహించిన నాకాబందీలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సైలెన్సర్లలో మార్పులు చేసి అధిక శబ్దం చేయడం, నంబర్ ప్లేట్ లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపడం, సరైన పత్రాలు లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు.

జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై ఎలాంటి రాజీ ఉండదని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని, అర్ధరాత్రి వరకు అనవసరంగా రోడ్లపై తిరగడం, బైక్ రేసింగ్‌లు నిర్వహించడం, సైలెన్సర్లు మార్చి అధిక శబ్దాలు చేయడం, గుంపులుగా తిరిగి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమన్నారు. అవసరమైతే వాహనాలను సీజ్ చేసి సంబంధిత చట్టాల ప్రకారం మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గంజాయి, మట్కా, జూదం, అక్రమ మద్యం విక్రయాలు, రౌడీయిజం తదితర అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేస్తామని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాల నియంత్రణ కోసం జిల్లాలో నిరంతరం నాకాబందీలు, ప్రత్యేక తనిఖీలు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు ఛేదన.. నలుగురు అరెస్ట్, రూ.30 లక్షల నగదు సహా కీలక స్వాధీనం

పట్టణంలోని దాబాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, టీ స్టాళ్ల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికే తమ వ్యాపార సంస్థలను మూసివేయాలని సూచించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత వ్యాపారాలు నిర్వహించడం లేదా అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పించినట్లు గుర్తిస్తే యజమానులపైనా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పట్టణంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలను ఎస్పీ కోరారు.

ఈ నాకాబందీ కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, సీఐలు నాగభూషణ్, సోమనర్సయ్య, పి.ఎన్.డి. ప్రసాద్, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *