మహబూబాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్, ఐపీఎస్ బుధవారం డోర్నకల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణ, రిసెప్షన్, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించిన ఎస్పీ, దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రతి కేసును బాధ్యతాయుతంగా విచారించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవా దృక్పథంతో 24 గంటలు అందుబాటులో ఉండే పోలీసింగ్ను అమలు చేయాలని సూచించారు.
నేరం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా, నేరాలను ముందుగానే అరికట్టే ప్రోయాక్టివ్ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాలు, తండాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ శాంతిభద్రతలను కాపాడాలని సూచించారు.
సీసీటీఎన్ఎస్ (CCTNS)లో ప్రతి కేసు, ఎఫ్ఐఆర్, దర్యాప్తు పురోగతి, స్టేషన్ దినచర్యలు, ఇతర ఆన్లైన్ రికార్డులను ఎప్పటికప్పుడు 100 శాతం నమోదు చేయాలని, ఎలాంటి పెండింగ్ ఉండరాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. డిజిటల్ అరెస్ట్ మోసాలు, లోన్ యాప్లు, ఓటీపీ మోసాలు, పెట్టుబడి మోసాలు, సోషల్ మీడియా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, రాత్రి వేళల్లో బ్లూ కోల్ట్స్, మొబైల్ పెట్రోలింగ్, బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, చోరీలు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.
విలేజ్ పోలీస్ అధికారులు (VPOలు) గ్రామస్థాయిలో ప్రజలతో సమన్వయం పెంచుకుని స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. ప్రజల సహకారంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం, కేసుల దర్యాప్తులో జాప్యం, ఆన్లైన్ అప్డేట్లలో ఆలస్యం, ప్రజలతో అమర్యాదకరంగా ప్రవర్తించడం వంటి అంశాలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించిన ఎస్పీ, ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
