తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 3వ తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్–2026కు సంబంధించి యాదాద్రి జోన్–V పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బందికి జోనల్ స్థాయి ఎంపిక పోటీలను నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు.
ఈ పోటీలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ డ్యూటీ మీట్లు పోలీసు సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచే అత్యుత్తమ వేదికలని అన్నారు. శాస్త్రీయ దర్యాప్తు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పేలుడు పదార్థాల గుర్తింపు, భద్రతా తనిఖీలు, కంప్యూటర్ ఆధారిత పోలీసింగ్ వంటి అంశాల్లో సిబ్బందికి ప్రాయోగిక అనుభవాన్ని ఈ పోటీలు అందిస్తాయని తెలిపారు.
జోనల్ స్థాయి పోటీల్లో శాస్త్రీయ దర్యాప్తు సహాయక పద్ధతులు, యాంటీ సబోటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో అధికారులు, సిబ్బంది తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఇందులో ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్–2026లో పాల్గొనే అవకాశం పొందనున్నారు.
ఇలాంటి పోటీలు పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే సామర్థ్యం, సమస్యలను వేగంగా విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందిస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల పోలీసు సిబ్బందితో అనుభవాలను పంచుకోవడం ద్వారా ఉత్తమ విధానాలను తెలుసుకునే అవకాశంతో పాటు ఆధునిక పోలీసింగ్లో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థంగా వినియోగించుకునే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు.
యాదాద్రి జోన్ నుంచి ఎంపికైన అధికారులు, సిబ్బంది రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాసులు, నరసింహాచారి, ఆర్ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, నరసింహ, సూరపు నాయుడు, పోలీస్ ప్రెసిడెంట్ జయరాజు తదితరులు పాల్గొన్నారు.
