Breaking News

జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన పోక్సో, గ్రేవ్, నాన్-గ్రేవ్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, కోర్టు విచారణలు, నేరస్తులకు శిక్షలు పడేలా తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. యూఐ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి, కోర్టుల్లో చార్జ్‌షీట్లు సకాలంలో దాఖలు చేయాలని ఆదేశించారు. అలాగే సీసీ నంబర్లు పెండింగ్, వారెంట్ల అమలు, పెండింగ్ సమన్ల తక్షణ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా దర్యాప్తు చేయాలని, మాదకద్రవ్యాల సరఫరా, రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని ఎస్పీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ప్రజా ప్రదేశాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, ప్రమాదకర కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ ఆదేశించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, చోరీల నివారణకు ప్రత్యేక గస్తీలు నిర్వహించాలని, హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. ప్రాపర్టీ కేసుల్లో రికవరీపై దృష్టి సారించి బాధితులకు స్వాధీనం చేసిన ఆస్తులను త్వరితగతిన అందజేయాలని సూచించారు.

ఎండ వేడిమిని తట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక సదుపాయాలు

డయల్-100కు వచ్చే ప్రతి కాల్‌పై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి తక్షణమే చేరుకోవాలని, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ తెలిపారు. ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కేసును బాధ్యతగా విచారణ చేయాలని ఆదేశించారు.

సైబర్ నేరాల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బ్యాంక్ మోసాలు, OTP మోసాలు, ఫేక్ లింకులు, ఆన్‌లైన్ ఫ్రాడ్‌లపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పెంచేలా ప్రజలు, వ్యాపార సంస్థల యజమానులతో సమావేశాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్‌బీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *