కరీంనగర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించిన జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్-3లో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. పలు సాంకేతిక, దర్యాప్తు, శోధన విభాగాల్లో విజేతలుగా నిలిచి జిల్లా పోలీసు శాఖకు గుర్తింపు తీసుకొచ్చారు.
మొదటి ఆరు ప్రధాన విభాగాలైన ఫోరెన్సిక్ సైన్స్ (లిఖిత పరీక్ష), క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ లా, మెడికో-లీగల్ టెస్ట్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్, ఫింగర్ ప్రింట్స్ సైన్స్ విభాగాల్లో సిరిసిల్ల రూరల్ సీఐ నాగేశ్వరరావు విశేష ప్రతిభ కనబర్చారు. ఎస్ఐల విభాగంలో బోయినపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ రమాకాంత్, వీర్నపల్లి ఎస్ఐ లక్ష్మణ్ ఉత్తమ ప్రదర్శన కనబర్చారు.
రక్షణ, శోధన విభాగాల్లో వెహికల్ సెర్చ్లో కానిస్టేబుల్ హరీష్, పేలుడు పదార్థాల (ఎక్స్ప్లోసివ్) శోధనలో కానిస్టేబుల్ కిరణ్ ప్రతిభ చాటారు. సాంకేతిక విభాగంలో ప్రోగ్రామింగ్ ఎబిలిటీలో కానిస్టేబుల్ రాజశేఖర్ విజేతగా నిలిచారు.
డ్యూటీ మీట్లో ప్రతిభ కనబర్చిన విజేతలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు. జోనల్ స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించిన విజేతలు త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో జోన్-III తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని ఆయన తెలిపారు.
