రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు. బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో బుధవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
గతంలో విగ్రహాల ఎత్తు కారణంగా విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్న విషయాన్ని గుర్తు చేసిన సీపీ, బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కరెంట్ షాక్తో ఇద్దరు మృతి చెందిన ఘటనతో పాటు పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద ఎత్తైన విగ్రహం ఇరుక్కుపోయిన సంఘటనలను ప్రస్తావించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నగరంలో సాధారణంగా విద్యుత్ తీగలు 22 అడుగుల ఎత్తులో ఉంటాయని, ఊరేగింపులో ఉపయోగించే ట్రాలీ ఎత్తు సుమారు నాలుగు అడుగుల వరకు ఉంటుందని పేర్కొంటూ, ఈ లెక్కలను దృష్టిలో ఉంచుకుని గణేష్ విగ్రహాలను 15 అడుగుల లోపే తయారు చేయాలని సూచించారు. విగ్రహాల తయారీదారులతో ముందుగానే మాట్లాడి ఈ నిబంధనలను పాటించేలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చొరవ తీసుకోవాలని కోరారు.
ఊరేగింపుల సమయంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను కర్రలు లేదా ప్లాస్టిక్ పైపులతో పైకి లేపే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. అలాంటి చర్యల వల్ల గతంలో ప్రమాదాలు జరిగాయని, ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విగ్రహాల తయారీ ప్రారంభ దశలోనే అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని ముందుగానే నిర్వహించినట్లు సీపీ తెలిపారు. ప్రజల ప్రాణరక్షణే ప్రధాన లక్ష్యమని, ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పండుగ నిర్వహణకు సంబంధించిన పలు సూచనలను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సీపీ దృష్టికి తీసుకురాగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ అన్ని విధాలా సహకరిస్తుందని సీపీ హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అదనపు సీపీ (సౌత్ రేంజ్) తఫ్షీర్ ఇక్బాల్, అదనపు డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) నర్సింహారావు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు రాఘవరెడ్డి, శశిధర్, కరోడి మల్, రామరాజు, మహేందర్, బుచ్చిరెడ్డి, రమేష్, వైకుంఠం, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.
