ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధించిన సిరిసిల్ల కోర్టు
రాజన్న సిరిసిల్ల: మైనర్ బాలికపై బలవంతపు వేధింపుల కేసులో ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2,000 జరిమానా విధిస్తూ రాధిక జైస్వాల్, సిరిసిల్ల పొక్సో కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన మైనర్ బాలికపై 2021లో వరుసకు అన్న అయిన తూర్పటి ప్రవీణ్ (ఎస్/ఓ జానీ) బలవంతపు వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం బయటపెడితే చంపేస్తామని ప్రవీణ్ తండ్రి తూర్పటి జానీ, నానమ్మ తూర్పటి పొచవ్వ బాధితురాలిని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్ఐ వెంకటకృష్ణ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం అప్పటి డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు.
ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వేముల లక్ష్మీ ప్రసాద్, పెంట శ్రీనివాస్ వాదనలు వినిపించారు. CMS ఎస్ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుళ్లు 10 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం సిరిసిల్ల పొక్సో కోర్టు ఇద్దరు నిందితులు తూర్పటి జానీ, తూర్పటి పొచవ్వలకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
ప్రధాన నిందితుడు తూర్పటి ప్రవీణ్ మైనర్ కావడంతో అతనిపై కేసు ప్రస్తుతం జువెనైల్ కోర్టులో కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. కఠిన శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ వ్యూహాత్మకంగా పని చేసి నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నారని అన్నారు.
కేసులో శిక్ష పడటానికి కృషి చేసిన పీపీలు వేముల లక్ష్మీ ప్రసాద్, పెంట శ్రీనివాస్, CMS ఎస్ఐ రవీంద్రనాయుడు, కోర్టు కానిస్టేబుళ్లు నవీన్, శ్రీనివాస్, అలాగే అప్పటి అధికారులు ఎస్ఐ వెంకటకృష్ణ, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డిలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
