జూలై 15, 2026: కొర్లకుంట తండాకు చెందిన ధరావత్ చరణ్ (19), తండ్రి కిషన్, తన వల్ల 16 ఏళ్ల మైనర్ బాలిక మూడు నెలల గర్భవతి కావడంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు తనపై POCSO చట్టం కింద కేసు నమోదు కానుందనే భయంతో స్వగ్రామంలో పురుగుల మందు సేవించిన ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి కొందరు వ్యక్తులు పోలీసు శాఖను అపఖ్యాతిపాలు చేయాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో తప్పుడు, నిరాధార ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరణ ప్రకారం, బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన అనంతరం చట్టబద్ధమైన విధివిధానాలకు అనుగుణంగా సంబంధిత పోలీస్ స్టేషన్కు కేసు పరిధి ప్రకారం పంపించారు. అలాగే, నిందితుడిని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా పెద్దమనుషుల పూచీకత్తుపై అప్పగించినట్లు వెల్లడించారు. బాధితురాలికి చట్టబద్ధమైన న్యాయం జరిగేలా అవసరమైన చర్యలను మాత్రమే పోలీసులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో పోలీసులు ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, పోలీసు శాఖ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో జరుగుతున్న దుష్ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న నిరాధార సమాచారాన్ని నమ్మకుండా, వాస్తవాలు నిర్ధారించకుండా అలాంటి పోస్టులను షేర్ చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అధికారిక సమాచారం కోసం పోలీసు శాఖ విడుదల చేసే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సూచించారు.
