మహబూబాబాద్: జిల్లా వ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారులు, లైసెన్స్ లేకుండా చిట్టీలు నిర్వహిస్తున్న వారిపై మహబూబాబాద్ జిల్లా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ సబ్డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి పలు కేసులు నమోదు చేశారు.
సీఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మొత్తం 90 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ రుణగ్రహీతల నుంచి షూరిటీ పేరుతో ఖాళీ చెక్కులు, భూముల అసలు పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, అలాగే ఎలాంటి లైసెన్స్ లేకుండా చిట్టీలు నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించారు.
పోలీసులు మొత్తం 10 మంది నిందితులపై 10 కేసులు నమోదు చేశారు. అదేవిధంగా వారి వద్ద నుంచి సుమారు రూ.3.59 కోట్ల విలువైన 266 డాక్యుమెంట్లను స్వాధీనం (సీజ్) చేసుకున్నారు.
అక్రమ వడ్డీ వ్యాపారం, అనుమతి లేకుండా చిట్టీల నిర్వహణ, ప్రజలను బెదిరించి ఖాళీ చెక్కులు, ఆస్తి పత్రాలు తీసుకోవడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని అధికారులు హెచ్చరించారు.
ప్రజలు ఎవరైనా అక్రమ వడ్డీ వ్యాపారులు లేదా లైసెన్స్ లేని చిట్టీల నిర్వాహకుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా జిల్లా పోలీస్ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
