గడువు ముగిసిన రసాయనాలతో ఉత్పత్తులు.. ఒకరి అరెస్ట్, భారీగా నిల్వలు స్వాధీనం
హైదరాబాద్, జూన్ 4: నగర ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా నకిలీ, గడువు ముగిసిన రసాయనాలతో చాక్లెట్లు తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ సిటీ పోలీసుల ప్రత్యేక విభాగం హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, హబీబ్నగర్ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఒక నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు భారీ మొత్తంలో చాక్లెట్ ఉత్పత్తులు, గడువు ముగిసిన ఫ్లేవర్లు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
సీతారాంబాగ్లో గుట్టుచప్పుడు కాకుండా తయారీ
నమ్మకమైన సమాచారం మేరకు అధికారులు ఓల్డ్ మల్లేపల్లిలోని సీతారాంబాగ్ ప్రాంతంలో ఉన్న ఓ చాక్లెట్ తయారీ కేంద్రంపై తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ చాక్లెట్ల తయారీ, ప్యాకింగ్, విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
చాక్లెట్ ప్యాకెట్లపై తయారీ తేదీ, గడువు ముగింపు తేదీ, బ్యాచ్ నంబర్, ‘బెస్ట్ బిఫోర్’ వంటి కీలక వివరాలు లేకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
గడువు ముగిసిన ఫ్లేవర్లు, రంగులతో తయారీ
మరింత లోతుగా పరిశీలించగా గడువు ముగిసిన ఫ్లేవర్లు, ఎస్సెన్స్లు, వివిధ రకాల రంగు పొడులను చాక్లెట్ల తయారీలో వినియోగిస్తున్నట్లు బయటపడింది. అలాగే పాత లైసెన్స్ వివరాలతో ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
సిబ్బందికి వైద్య ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం, పెస్ట్ కంట్రోల్ రికార్డులు నిర్వహించకపోవడం వంటి పలు ఉల్లంఘనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
భారీగా చాక్లెట్ నిల్వలు, యంత్రాల స్వాధీనం
దాడిలో వందల కిలోల చాక్లెట్లు, చోకో బాల్స్, చాక్లెట్ స్టిక్స్, మార్ష్మెలో ఉత్పత్తులు, వివిధ రకాల ఫ్లేవర్లు, రంగు పదార్థాలు, చాక్లెట్ తయారీ యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు
స్వాధీనం చేసుకున్న వస్తువులను జప్తు చేసిన అధికారులు నిందితుడిని హబీబ్నగర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఆపరేషన్ను హెచ్-ఫాస్ట్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులు, హబీబ్నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించగా, నగర ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
