సిరిసిల్ల: డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.
మంగళవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాచర్ల జూనియర్ కళాశాలలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండి తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, నకిలీ వెబ్సైట్లను నమ్మవద్దని సూచించారు. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి, సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీట్బెల్ట్ ధరించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడడంతో పాటు నిర్లక్ష్య డ్రైవింగ్కు దూరంగా ఉండాలని, ఇతరుల్లోనూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని కోరారు.
చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నైతిక విలువలు, చట్టాల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తే విద్యార్థులు తమ భవిష్యత్తును విజయవంతంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడగలరని డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఎస్ఐ రాహుల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
