Breaking News

హత్నూర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

రికార్డుల నవీకరణ, ప్రజలతో మర్యాదపూర్వక వ్యవహారం, సైబర్ అవగాహనపై ప్రత్యేక సూచనలు

సంగారెడ్డి, జూన్ 4: హత్నూర పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ, సిబ్బంది బ్యారెక్స్, రికార్డుల నిర్వహణ, విధి నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

పరిశుభ్రతకు ప్రాధాన్యం

పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యారెక్స్ పరిశుభ్రతను పరిశీలించిన ఎస్పీ, పరిశుభ్రమైన వాతావరణంలోనే విధులు సమర్థవంతంగా నిర్వహించగలమని పేర్కొన్నారు. ప్రతి సిబ్బంది పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి

స్టేషన్ రికార్డులను పరిశీలించిన ఎస్పీ, దర్యాప్తులో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

రౌడీ షీటర్లు, అనుమానితులపై నిఘా

తరచూ వాహనాల తనిఖీలు, నాకాబందీలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, కేడీలు, అనుమానిత వ్యక్తుల వివరాలు ప్రతి సిబ్బందికి తెలిసి ఉండాలని, బీట్ విధుల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

రికార్డులు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలి

పగలు, రాత్రి బీట్‌ల ద్వారా సేకరించే సమాచారాన్ని ఆన్‌లైన్ రికార్డుల్లో ఎప్పటికప్పుడు నవీకరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. సాంకేతికతను వినియోగిస్తూ సమాచార నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు.

సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన

ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్టేషన్ అధికారులకు సూచించారు. గ్రామాలు, కాలనీల్లో ప్రజలకు భద్రతా సూచనలు అందించాలని చెప్పారు.

మహబూబాబాద్ జిల్లాకు 4,000 గంజాయి టెస్టింగ్ కిట్లు

ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓపికగా విని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.

సిబ్బంది ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం

పోలీస్ శాఖలో శారీరక దారుఢ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఎస్పీ, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ తనిఖీలో హత్నూర ఎస్‌హెచ్‌వో శ్రీధర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *