తెలంగాణ పోలీసు మహిళా భద్రత విభాగం (Women Safety Wing) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘స్టాండ్ విత్ హర్’ (Stand with Her) ప్రచారాన్ని విస్తరించేందుకు మాస్టర్ ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్లోని యూసుఫ్గూడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (NI-MSME)లో నిర్వహించిన ఈ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (ToT) కార్యక్రమంలో తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మహిళా భద్రత విభాగం డైరెక్టర్ జనరల్ చారు సిన్హా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పరిమళ హనా నూతన్, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర సింగ్, స్కూల్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన డాక్టర్ సౌందర్య జోసెఫ్, మహిళా భద్రత విభాగం హెడ్ ఆఫ్ ట్రైనింగ్ ఆసియా షెర్వానీ హాజరయ్యారు.
‘స్టాండ్ విత్ హర్’ ప్రచారం మహిళలు, బాలికల భద్రతకు మద్దతుగా పురుషులు, యువకులు ముందుకు రావాలని ప్రోత్సహించే ప్రవర్తనా మార్పు కార్యక్రమం. మహిళల పట్ల అనుచిత ప్రవర్తనను గుర్తించి ప్రశ్నించడం, లింగ వివక్షకు వ్యతిరేకంగా స్పందించడం, సురక్షితమైన, గౌరవప్రదమైన విద్యా వాతావరణాన్ని రూపొందించడంలో భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
ఈ శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు తమ తమ విద్యాసంస్థల్లో ఇదే తరహా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా లింగ సమానత్వం, మహిళల భద్రతపై చైతన్యాన్ని విస్తరించనున్నారు.
ఈ సందర్భంగా చారు సిన్హా మాట్లాడుతూ మహిళలపై హింసను అరికట్టాలంటే పురుషులు, యువకుల భాగస్వామ్యం ఎంతో అవసరమని, విద్యాసంస్థలు విద్యార్థులలో సానుకూల ఆలోచనలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
డాక్టర్ రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సమానత్వం, పరస్పర గౌరవం, మానవీయ విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంతో ముఖ్యమని అన్నారు. మహిళా భద్రత విభాగం, విద్యాశాఖ సంయుక్తంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.
మహిళా భద్రత విభాగం హెడ్ ఆఫ్ ట్రైనింగ్ ఆసియా షెర్వానీ నేతృత్వంలో నిర్వహించిన శిక్షణలో లింగ సున్నితత్వం, అనుచిత ప్రవర్తనను గుర్తించడం, బైస్టాండర్ ఇంటర్వెన్షన్, సమర్థవంతమైన శిక్షణా పద్ధతులు, ఉన్నత విద్యాసంస్థల్లో ఈ ప్రచారాన్ని అమలు చేసే విధానాలపై పాల్గొన్న వారికి ప్రాయోగిక అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యాశాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అధ్యాపకులకు మహిళా భద్రత విభాగం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన విద్యా వాతావరణాన్ని కల్పించే దిశగా ఈ కార్యక్రమం కీలక అడుగుగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.
