సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “ప్రజావాణి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత అంశాలపై ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్.హెచ్.ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఎలాంటి భయాలు లేకుండా, ఎలాంటి మధ్యవర్తిత్వం అవసరం లేకుండా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే “ప్రజావాణి” కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు.




