సంగారెడ్డి: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదును ఓపికగా విన్న ఎస్పీ, సంబంధిత అంశాలపై స్థానిక పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు సేకరించారు. ఫిర్యాదుల స్వభావాన్ని పరిశీలించి, వాటిపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీసు ఉన్నతాధికారులను నేరుగా కలిసే అవకాశం కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోయినా, ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
అలాగే తమ సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, ఎవరినీ నమ్మి మోసపోవద్దని సూచించారు. సమస్యలను నేరుగా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా త్వరితగతిన పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు.
ప్రజావాణి ద్వారా స్వీకరించే ప్రతి ఫిర్యాదును జిల్లా పోలీసు కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఫిర్యాదు స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వెల్లడించారు.
జిల్లా ప్రజలు పోలీసు శాఖపై నమ్మకం ఉంచి తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
