వికారాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్న అధికారిక వేడుకల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పరేడ్ రిహార్సల్స్ను వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పరిశీలించారు.
ఈ సందర్భంగా పరేడ్ ప్రదర్శనను క్షుణ్ణంగా గమనించిన ఎస్పీ, వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, క్రమశిక్షణతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, విధుల నిర్వహణలో అలసత్వాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
రిహార్సల్స్ అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమైన రోజు అని పేర్కొన్నారు. పోలీస్ శాఖ తరఫున నిర్వహించే పరేడ్ ఆకర్షణీయంగా, గౌరవప్రదంగా ఉండేలా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ నైపుణ్యాన్ని, క్రమశిక్షణను ప్రదర్శించాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించి పరేడ్ను విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం కార్యక్రమ వేదిక పరిసర ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణ మార్గాలను పరిశీలించిన ఎస్పీ, ప్రజాప్రతినిధులు, విఐపీలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించే అమరవీరుల స్తూపం వద్ద భారీగా ప్రజలు, ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, ఏఆర్ డీఎస్పీ వీరేష్, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘు కుమార్, ఆర్ఐ నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
