సంగారెడ్డి, మే 30: ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజ ప్రక్రియ అయినప్పటికీ, పోలీసు శాఖకు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో ఎస్ఐ అంజిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరప్పలను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అంజిరెడ్డి 1989లో కానిస్టేబుల్గా పోలీసు శాఖలో చేరి, ఉమ్మడి జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించారని తెలిపారు. జిల్లా క్రైమ్ రికార్డు బ్రాంచ్లో సుదీర్ఘకాలం సేవలందించి, ఎలాంటి ప్రతికూల రిమార్క్ లేకుండా అంచెలంచెలుగా పదోన్నతులు పొంది సబ్-ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదగడం ఆయన కృషికి నిదర్శనమన్నారు.
హెడ్ కానిస్టేబుల్ వీరప్ప 1993లో ఆర్మ్డ్ రిజర్వ్ సివిల్ పోలీస్ కానిస్టేబుల్గా పోలీసు శాఖలో చేరి, ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించారని కొనియాడారు. సర్వీస్ మొత్తంలో ఎలాంటి ప్రతికూల రిమార్క్ లేకుండా హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి అధికారుల ప్రశంసలు పొందడం అభినందనీయమని అన్నారు. రిటైర్మెంట్ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.
అనంతరం పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి, వారి సేవలను గుర్తు చేసుకుంటూ పోలీసు శాఖ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవసరం వచ్చినా పోలీసు కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆర్ఐ సురేష్, డీసీఆర్బీ ఎస్ఐ కావేరి, పోలీసు సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


