సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని అలియాబాద్, కంది గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అవసరాన్ని బట్టి రవాణా వాహనాలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యాన్ని అక్రమంగా తెలంగాణలో విక్రయించకుండా చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.
