Breaking News

బేగం బజార్‌లో మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.30 లక్షల బంగారం, నగదు స్వాధీనం

హైదరాబాద్‌లోని బేగం బజార్ పోలీసులకు భారీ విజయం లభించింది. వరుస ఇండ్ల దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.30 లక్షల విలువైన 206 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,14,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్రమోహన్ ఆదేశాల మేరకు, గోషామహల్ డివిజన్ ఏసీపీ కె. చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో బేగం బజార్ ఇన్స్పెక్టర్ పి. భరత్ కుమార్, డిటెక్టివ్ ఎస్ఐ కె. జగదీశ్వర్ రావు మరియు క్రైమ్ బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది.

అరెస్టైన నిందితుడు అమర్ సోన్‌కాంబ్లే (20) మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గీర్ గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిషన్ బాగ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఫంక్షన్ హాళ్లలో వెయిటర్‌గా పని చేస్తున్న అతను విలాసవంతమైన అలవాట్లకు బానిసై, సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాల మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మూడు ఇండ్ల దొంగతనాల కేసులు, ఒక పోక్సో కేసు నమోదై ఉన్నాయి.

ఈ నెల 6వ తేదీన గోషామహల్ హిందీ నగర్‌లోని ఓ ఇంట్లో తెల్లవారుజామున తాళాలు పగలగొట్టి భారీ చోరీ జరిగిన ఘటనపై బేగం బజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితుడు ఎం. కృష్ణ ఫిర్యాదు మేరకు సుమారు 235 గ్రాముల బంగారం, రూ.10 లక్షల నగదు దొంగిలించబడినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించి నిందితుడిని గుర్తించారు.

అంతర్రాష్ట్ర మొబైల్ దొంగల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్, భారీగా మొబైల్ విడిభాగాలు స్వాధీనం

17 మే 2026న అమర్ సోన్‌కాంబ్లేను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అనంతరం అతని వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు రికవరీ చేశారు.

కేసును తక్కువ సమయంలో చేధించి నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన బేగం బజార్ పోలీస్ సిబ్బందిని గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్రమోహన్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *