ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి మొత్తం 37 ఫిర్యాదులను స్వీకరించారు.
ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ మహేష్ బి. గితే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, బాధితుల సమస్యలను చట్టపరంగా వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసి వాటి పరిష్కార స్థితిని నిరంతరం సమీక్షిస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.
గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడంతో వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు.
