Breaking News

హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు కఠిన చర్యలు: సీపీ సజ్జనర్

హైదరాబాద్ నగరాన్ని మాదకద్రవ్యాల రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ కేంద్రాన్ని ఆయన సందర్శించి, డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన రౌడీ షీటర్లతో నేరుగా మాట్లాడారు.

ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వ్యసనం నుండి బయటపడేందుకు తీసుకుంటున్న చర్యలపై విచారించారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి, బాధితులకు మానసికంగా అండగా నిలవాలని సూచించారు. అనంతరం వైద్యులతో సమావేశమై కౌన్సెలింగ్ మరియు చికిత్స విధానంపై వివరాలు తెలుసుకున్నారు.

సీపీ సజ్జనర్ మాట్లాడుతూ నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. 239 మంది రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించగా, అందులో 188 మందికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 35 మంది గాంధీ డీ-అడిక్షన్ కేంద్రంలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారికి ఇతర కేంద్రాల్లో కౌన్సెలింగ్ అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 డీ-అడిక్షన్ కేంద్రాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా డ్రగ్స్ వ్యసనానికి గురైన వారికి విముక్తి కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ఒకవైపు చికిత్స అందిస్తూనే, మరోవైపు డ్రగ్స్ విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రోడ్డు భద్రత, సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత – డిఎస్పీ నాగేంద్రచారి.

నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆధునిక డ్రగ్ డిటెక్షన్ కిట్లు అందుబాటులో ఉంచామని, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులకు, ముఖ్యంగా యువతకు డ్రగ్ టెస్టులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పోలీసులకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *