నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఏఆర్సీ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అత్యవసరమని తెలిపారు. హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుందని హెచ్చరించారు. గత ఏడాది జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 350 మంది మరణించగా, వారిలో 90 శాతం మంది హెల్మెట్ ధరించని వారేనని వెల్లడించారు. అవగాహన కార్యక్రమాల అనంతరం హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం ఎంత ముఖ్యమో వివరించిన ఎస్పీ, మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారని, ఈ సమయంలో బాధితులకు చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి రహవీర్ పథకం ద్వారా రూ.25,000 నుంచి రూ.1 లక్ష వరకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సిబ్బంది సంఖ్యను పెంచాలని సూచించారు. హైవేల వెంట ఉన్న మద్యం దుకాణాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు కోసం సహకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ప్రథమ చికిత్స విధానాలపై ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు భద్రతా నిబంధనలు పాటించేందుకు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పోలీసులు, ఆర్టీవో అధికారులు, వైద్య సిబ్బంది, డ్రైవర్లు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






