ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సీపీ సీవీ సజ్జనర్ సూచన
హైదరాబాద్, మార్చి 2: నగరంలో హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV Anand ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీ కార్యాలయం నుంచి సోమవారం పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన కమిషనర్, పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. బ్లూ కోట్స్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ కాయాలని సూచించారు.
ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూయడం సహించబోమని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పాదచారులు, వాహనాలపై రంగులు చల్లొద్దని హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నగరవ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందని తెలిపారు.
రసాయన రంగుల బదులు సహజ రంగులు వాడాలని సూచించిన ఆయన, వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని చెప్పారు. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ప్రస్తుతం రంజాన్ మాసం నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముస్లింల ప్రార్థనలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పీస్ కమిటీల సమన్వయంతో పనిచేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
హోలీ సందర్భంగా మంగళవారం (3-3-2026) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పోలీసులకు సహకరించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.
సమీక్షా సమావేశంలో అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు శ్వేత, ఎస్ఎం విజయ్ కుమార్, డీసీపీలు ఖారే కిరణ్ ప్రభాకర్, రూపేశ్, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



