నల్లగొండ, మార్చి 3: నల్లగొండ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12-12-2018న జరిగిన హత్య కేసులో నిందితుడు రామాపురం మల్లేశ్వర్ రావుకు గౌరవనీయ Spl. Sessions Court for SC/ST (POA) Act Cases -cum- II nd Addl. Dist & Sessions Judge జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
ఘటన వివరాలు
మృతుడు రామావత్ బాల (35) నల్లగొండ పట్టణంలోని తులసి నగర్ ప్రాంతానికి చెందినవాడు. మృతుడి సోదరితో నిందితుడికి అక్రమ సంబంధం ఉండగా, మృతుడు అడ్డుగా వస్తున్నాడనే కారణంతో పథకం ప్రకారం 12-12-2018 ఉదయం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు నల్లగొండ II టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంఘటన స్థలంలో రక్తంతో తడిసిన బండరాయి, లుంగీ, ఇతర దుస్తులు మరియు రక్తపు నమూనాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)కు పంపించారు. డీఎన్ఏ విశ్లేషణలో సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న వస్త్రాలపై మరియు నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న చొక్కాపై లభించిన రక్తపు మరకలు ఒకే జీవసంబంధ మూలానికి చెందినవని నిర్ధారణ అయింది. అదేవిధంగా 164 Cr.P.C ప్రకారం కీలక సాక్షుల వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.
కోర్టు తీర్పు
శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలు మరియు వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం కోర్టు నిందితుడిపై నేరాన్ని నిర్ధారించింది.
- IPC సెక్షన్ 302 కింద జీవిత ఖైదు మరియు రూ.10,000 జరిమానా
- SC/ST (POA) చట్టం సెక్షన్ 3(2)(v) కింద మరో జీవిత ఖైదు మరియు రూ.10,000 జరిమానా
- IPC సెక్షన్ 201 కింద 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.10,000 జరిమానా
మొత్తం రూ.30,000 జరిమానా విధించగా, అన్ని శిక్షలు సమాంతరంగా అమలులో ఉంటాయని కోర్టు స్పష్టం చేసినట్లు ఎస్పీ తెలిపారు.
అధికారులకు అభినందనలు
ఈ కేసును శాస్త్రీయంగా, సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేసిన అప్పటి దర్యాప్తు అధికారులు డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, సీఐ మహబూబ్ బాషా, ఎస్ఐ నరసింహులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖిలతో పాటు ప్రస్తుత అధికారులు డిఎస్పీ శివరాం రెడ్డి, సీఐ రాఘవరావు, ఎస్ఐ సైదులు, సీడీఓ సుమన్, కోర్టు లైజనింగ్ అధికారులు నరేందర్, మల్లికార్జున్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
