మార్చి 2, 2026: రేపు నిర్వహించుకోనున్న హోళీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, పండుగను ప్రశాంత వాతావరణంలో, పరస్పర గౌరవంతో నిర్వహించుకోవాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సహజసిద్ధమైన రంగుల వినియోగం
హోళీ సందర్భంగా హానికరమైన రసాయనిక రంగులు వాడకుండా, సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలు, రహదారులపై వాహనదారులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని తెలిపారు.
మహిళల భద్రతకు ప్రత్యేక నిఘా
మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో షీ టీమ్ బృందాలను ప్రత్యేకంగా మోహరింపజేసి, ప్రధాన కూడళ్లలో మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పహారా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నీటి వనరుల వద్ద జాగ్రత్తలు
ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లకూడదని, చిన్నపిల్లలను అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. లోతైన నీటిలో ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
అపోహలపై కఠిన చర్యలు
పండుగ వేళ ఎవరైనా గొడవలు సృష్టించినా, అసత్య ప్రచారం చేసినా, సామాజిక మాధ్యమాల ద్వారా అపోహలు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి, సురక్షితంగా హోళీ పండుగను జరుపుకొని పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
