మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించిన ఆయన, స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు మరింత స్నేహపూర్వక వాతావరణంలో సేవలు అందించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.
ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున దూర ప్రాంతాల నుంచి పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో యువతను గంజా వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. గ్రామ స్థాయిలో నైట్ పట్రోలింగ్ విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు.
అలాగే హోటల్స్, లాడ్జ్లను తరచుగా తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండేలా సూచనలు ఇవ్వాలని తెలిపారు.
గంజా వంటి మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని పేర్కొన్న ఎస్పీ, వాటి దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గంజా సంబంధిత సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే 8712656999 నంబర్కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ కోరారు.
