బక్రీద్ పండుగ సందర్భంగా మునుగోడు రోడ్డులోని ఈద్గా ప్రాంగణంలో చేపట్టిన ఏర్పాట్లను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. ప్రార్థనలకు భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీరు, పరిశుభ్రత వంటి అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
సామరస్య వాతావరణాన్ని కాపాడాలని, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ ఆది రెడ్డి, 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ ఆమేర్, కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
