బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలోని గొర్రెలు, మేకల సంతలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు డిజిటల్ చెల్లింపుల పేరుతో అమాయక వ్యాపారులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఫేక్ ఫోన్పే, గూగుల్ పే తరహా నకిలీ యాప్లను ఉపయోగించి డబ్బు పంపించినట్లుగా మొబైల్ స్క్రీన్లో చూపించి వ్యాపారులను నమ్మిస్తున్నారు. సంతల్లో హడావుడి ఎక్కువగా ఉండటంతో తమ బ్యాంక్ ఖాతాల్లో నిజంగా డబ్బు జమ అయ్యిందో లేదో తనిఖీ చేయకుండా గొర్రెలు, మేకలను అప్పగిస్తున్న వ్యాపారులు మోసపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కంచన్బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి రెండు ఘటనలు నమోదయ్యాయి. కంచన్బాగ్ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు మూడు బైక్లపై వచ్చి ఒక వ్యాపారితో బేరం కుదుర్చుకుని రూ.68 వేల చెల్లింపు చేసినట్లు ఫేక్ యాప్ ద్వారా చూపించి గొర్రెలను తీసుకెళ్లిపోయారు. అలాగే రాజేంద్రనగర్లో నలుగురు వ్యక్తులు రూ.48 వేల విలువైన గొర్రెలను కొనుగోలు చేసి ఇదే తరహాలో మోసం చేశారు. బాధితులు తర్వాత బ్యాంక్ ఖాతాలు తనిఖీ చేయగా డబ్బు జమ కాలేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు గొర్రెలు, మేకల విక్రయదారులకు కీలక సూచనలు చేశారు. కేవలం కొనుగోలుదారుడి మొబైల్లో కనిపించే “పేమెంట్ సక్సెస్” స్క్రీన్ను నమ్మవద్దని హెచ్చరించారు. మీ మొబైల్కు వచ్చే అధికారిక బ్యాంక్ ఎస్ఎంఎస్ను లేదా నేరుగా బ్యాంకింగ్ యాప్లో బ్యాలెన్స్ను చెక్ చేసిన తర్వాతే జీవాలను అప్పగించాలని సూచించారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగే సందర్భాల్లో నగదు రూపంలో చెల్లింపులు తీసుకోవడం మరింత సురక్షితమని తెలిపారు.
ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా మోసం చేయడానికి ప్రయత్నించినా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని, సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
