హైదరాబాద్: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ప్రతిపాదించిన వన్వే విధానాన్ని త్వరలో అమలు చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్తో పాటు ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, నిర్మాణ సంస్థల ఉన్నతాధికారులు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.
ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అధికారులు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన పర్యటించి, అగ్రసేన్ కూడలి, ఫిలింనగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రధాన ద్వారం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన వన్వే ట్రయల్ రన్ సందర్భంగా తలెత్తిన సమస్యలను సమీక్షించి, వాటి పరిష్కారంపై చర్చించారు.
కొన్ని ప్రాంతాల్లో రహదారులు ఇరుకుగా ఉండటం వల్లే రద్దీ ఏర్పడుతోందని గుర్తించిన అధికారులు, ఆయా చోట్ల వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అలాగే వన్వే అమలుకు అవసరమైన చిన్నపాటి సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పాదచారుల భద్రత కోసం లేన్ మార్కింగ్లు, పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేబీఆర్ పార్క్ అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు వెల్లడించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్వే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీస్ సూచించిన అన్ని పనులను త్వరగా పూర్తి చేసి, ప్రజలకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పనుల సమయంలో నగరవాసులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ పరిశీలనలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయల్ డెవిస్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్, డీసీపీ (ట్రాఫిక్) కాజల్తో పాటు జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
