Breaking News

నేర నియంత్రణే లక్ష్యం.. నల్లగొండలో తెల్లవారుజామున భారీ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

నల్లగొండ జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ Sharath Chandra Pawar ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసి సతీష్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో 7 మంది సీఐలు, 18 మంది ఎస్‌ఐలు, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పట్టణంలోని కాలనీలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 360 ఇండ్లలో తనిఖీలు చేయగా 46 మంది అనుమానితులను గుర్తించి వారి వివరాలను సేకరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది వ్యక్తులను కూడా పోలీసులు గుర్తించారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 10 మంది, బీహార్‌కు చెందిన 4 మంది, హర్యానాకు చెందిన 2 మంది, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

తనిఖీల్లో ఇద్దరు రౌడీషీటర్లు, ఐదుగురు ట్రబుల్ మాంగర్స్‌ను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఆరుగురికి గంజా టెస్టులు నిర్వహించగా ఇద్దరు గంజా సేవించినట్లు తేలింది. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

మహబూబాబాద్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.. గుడుంబా, బెల్లం, బీర్ బాటిళ్ల స్వాధీనం

వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అధిక శబ్దం చేసే 2 వాహనాలపై ప్రత్యేక కేసులు నమోదు చేస్తున్నారు. అదనంగా 4 సెల్‌ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు.

నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసు శాఖ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *