Breaking News

రూ.2,100 వివాదం.. యువకుడిపై కత్తులతో హత్యాయత్నం.. 48 గంటల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్

హైదరాబాద్, జూలై 9: కేవలం రూ.2,100 బకాయి డబ్బుల వివాదం ఓ యువకుడిపై హత్యాయత్నానికి దారితీసింది. ఈ ఘటనలో 48 గంటల్లోనే ఇద్దరు నిందితులను అత్తాపూర్ పోలీసులు, రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు కత్తులు, రెండు మొబైల్ ఫోన్లు, ఘటన సమయంలో ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌లోని సులేమాన్ నగర్‌కు చెందిన సయ్యద్ పాషు, సయ్యద్ అఫ్తాబ్ అలియాస్ అఫ్ఫు (24) గత ఐదేళ్లుగా స్నేహితులు. ఈ ఏడాది మేలో ఇద్దరూ ముంబైకి వెళ్లి సరుకు రవాణా వాహనాల డ్రైవర్లుగా పనిచేశారు. అక్కడ యజమాని షేక్ మొబిన్ సయ్యద్ పాషుకు రూ.2,100 జీతం బకాయి ఉంచడంతో, ఆ డబ్బు ఇప్పించాలని అఫ్తాబ్‌ను పాషు పదేపదే నిలదీసేవాడు.

ఈ క్రమంలో జూలై 6 రాత్రి ఇద్దరి మధ్య ఫోన్‌లో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన అఫ్తాబ్ తన పరిచయస్తుడు అక్బర్ ఖాన్ (28)ను ఇంటికి పిలిపించి పాషును హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.

జూలై 7 తెల్లవారుజామున పాషు తన స్నేహితులతో కలిసి అఫ్తాబ్ ఇంటి వద్దకు వెళ్లి డబ్బుల విషయంలో గొడవకు దిగాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్బర్ ఖాన్ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, పాషు స్నేహితులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పాషు కూడా తన వద్ద ఉన్న కత్తిని బయటకు తీశాడు. వెంటనే అఫ్తాబ్ ఇంట్లోకి వెళ్లి మరో కత్తి తీసుకొచ్చి పాషు పొత్తికడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన పాషు కుప్పకూలగా, ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

వినాయక చవితి ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సజ్జనర్ కీలక సూచనలు.. 15 అడుగుల లోపు గణేష్ విగ్రహాల తయారీకి పిలుపు

ఈ ఘటనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 792/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 109(1), 111, 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి 48 గంటల్లోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాయి.

దర్యాప్తులో అఫ్తాబ్‌పై గతంలో రాజేంద్రనగర్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం సహా రెండు కేసులు ఉన్నట్లు, అక్బర్ ఖాన్‌పై మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసు నమోదై కోర్టు విచారణలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఐపీఎస్ పర్యవేక్షణలో అత్తాపూర్ ఎస్‌హెచ్‌వో కె. నాగేశ్వరరావు, రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె. రవి ఆధ్వర్యంలోని బృందం నిందితులను అరెస్ట్ చేసింది. వేగంగా కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీసీపీ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *