బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా మీదుగా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ఏర్పాటు చేసిన చెక్పోస్టులను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పుల్కల్, ఎంఎన్ఆర్, కవలంపేట్, ఇంద్రకరణ్, కొండాపూర్, మునిపల్లి చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడిన ఎస్పీ.. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.
వాహనాల తనిఖీల సమయంలో పోలీసులు తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించాలని, లైట్ బ్యాటన్లను వినియోగించాలని సూచించారు. అలాగే బీట్, పెట్రోలింగ్ విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు కీలక సూచనలు చేశారు.
ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తప్పుడు ప్రచారాలు, సోషల్ మీడియాలో అసత్య సందేశాలు ఫార్వర్డ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.
