నల్గొండ జిల్లాలో బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరల్చి నగదు దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.2.20 లక్షల నగదు, HF డీలక్స్ ద్విచక్ర వాహనం, ఒక వివో సెల్ఫోన్, బ్యాంక్ పాస్బుక్లు మరియు దృష్టి మరల్చడానికి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
డీఎస్పీ కె. శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 19న నల్గొండ 1 టౌన్ పరిధిలోని క్లాక్టవర్ సమీపంలోని యూనియన్ బ్యాంక్ వద్ద రైతు గాదె లింగయ్య రూ.1.50 లక్షలు డ్రా చేసి తన బైక్ ట్యాంక్ కవర్లో పెట్టుకున్నాడు. ఈ సమయంలో నిందితులు మరో బైక్ను అడ్డంగా పెట్టి, అతని దృష్టి మరల్చి నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీఐ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, వాహనాల వివరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు నకిరేకల్లో మరో రైతు వద్ద నుంచి రూ.1.40 లక్షలు దొంగిలించి పారిపోతుండగా పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు.
పట్టుబడిన నిందితులు మహారాష్ట్ర రాష్ట్రంలోని సోలాపూర్కు చెందిన కేశవ తేజ దొక్వల (20) మరియు ఓ మైనర్ బాలుడిగా గుర్తించారు. మరో నిందితుడు రాహుల్ పరారీలో ఉన్నాడు. విచారణలో మక్తల్, మరికల్, నల్గొండ, ఖమ్మం త్రీటౌన్, నకిరేకల్ ప్రాంతాల్లో కూడా ఇదే తరహా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు.
ప్రజలు బ్యాంకుల వద్ద అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నగదు డ్రా చేసే సమయంలో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టాలని, అవసరమైతే కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సైలు సైదులు, సైదాబాబు మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

